దేవాలయాలంటేనే
ప్రశాంతతకు చిహ్నాలు. అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత
కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి
ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరు ఏ
దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకుంటానికి ముందు కచ్చితంగా
ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలును బట్టి ఎక్కువ ప్రదక్షిణలు
చేస్తే కొందరు 3 ప్రదక్షిణలే చాలని చెప్పి అనంతరం దైవ దర్శనం కోసం
వెళ్తారు. ఈ క్రమంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లినప్పుడు భక్తులు అలా
తమ వీలును బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు, కానీ శివుడి గుడికి
వెళ్లినప్పడు మాత్రం కింద చెప్పిన విధంగా క్రమ పద్ధతిలో
ప్రదక్షిణలు చేయాలట. అప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతుందో, అసలు ఆ
ప్రదక్షిణలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పై
చిత్రం చూశారా..! గర్భగుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంది. పక్కనే
లింగాన్ని అభిషేకించిన జలం వెళ్తూ ఉంది. దాని కిందే చండీశ్వరుడు కొలువై
ఉన్నాడు. అయితే శివాలయంలోకి వెళ్లగానే నేరుగా శివుని గర్భగుడి చుట్టూ
ప్రదక్షిణలు చేయకూడదట. ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ
ప్రారంభించి చండీశ్వరుని వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకుని మళ్లీ
వెనక్కి రావాలి. అనంతరం చిత్రంలో చూపినట్టుగా బాణం గుర్తుల ప్రకారం
ప్రదక్షిణ చేయాలి. ఒకసారి చండీశ్వరుని దర్శించుకుని వెనక్కి వచ్చి
నందీశ్వరుని వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించే
జలం వద్దకు రావాలి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నందీశ్వరుని
వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు
దాంతో ఎంతో ఫలితం కలుగుతుందట.
సాధారణంగా
భక్తులు దేవాలయాల్లో 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు కదా. కానీ పైన
చెప్పిన విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అది 10వేల ప్రదక్షిణలతో
సమానమట. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు. అయితే పైన
చెప్పినట్టుగా కాక శివుని గర్భగుడి చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణ
చేయకూడదట. ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జలం వెళ్లే దారి వద్ద
ప్రమథ గణాలు కొలువై ఉంటాయట. వాటిని దాటి ప్రదక్షిణ చేయకూడదట.
అలా చేస్తే తప్పు చేసినట్టు అవుతుందట. కొద్దిగా ప్రయత్నిస్తే పైన
చెప్పినట్టుగా ప్రదక్షిణ చేయడం సులభమేనని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment